. . . జిల్లాలో స్టేడియాన్ని నిర్మించాలి
. . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ – 2026 కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఆర్ఆర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ఒలంపిక్ రన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడల స్ఫూర్తి అయిన క్రమశిక్షణ, ఐక్యత, శాంతి, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. జిల్లాలో క్రీడాకారులకు వసతులు లేకున్నా ఆయా క్రీడాంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. ఒలంపిక్స్ అంటే కేవలం క్రీడలు మాత్రమే కాదని ప్రపంచ దేశాల మధ్య స్నేహం శాంతి బాధ్యతకు ప్రతీక అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైనికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రమశిక్షణ అంకితభావం జట్టు భావన క్రీడల ద్వారా అలవాడతాయన్నారు.

జిల్లాలో సరైన సౌకర్యాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే అనేకసార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు. జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు గూగులోతు సౌమ్య, ఎండల సౌందర్య, హుసాముద్దీన్ తదితరులు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు భక్తవత్సలం, బొబ్బిలి నరసయ్య, ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు, బిజెపి కార్పొరేటర్లు నాగోల లక్ష్మీనారాయణ, బట్టు రాఘవేందర్, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు.
