- డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శoతన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో ఉందని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించడం లేదని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శoతన్ అన్నారు. సిరికొండ మండలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం వివిధ పాఠశాలలను పర్యటించి ఉపాధ్యాయులను డిటిఎఫ్ సభ్యులుగా చేర్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తగినంత బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కారణంగా ప్రభుత్వ విద్య సంక్షేభంలోకి వెళ్లడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా విద్యారంగం అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించి డి ఎస్ కొటారి కమిషన్ పేర్కొన్నట్లు కేంద్రం జిడిపిలో ఆరు శాతం నిధులు, రాష్ట్రాలు 30 శాతం నిధులు కేటాయించాలనే సిఫారసులు తక్షణమే అమలు చేస్తూ కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం కావడానికి అవకాశం ఉందన్నారు. తద్వారా ప్రజలు పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందించవచ్చని శoతన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా తమ పార్టీ అధికారంలోకి వస్తే 15% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని వాగ్దానం చేశారని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టి గత సంవత్సరం బడ్జెట్లో 7.3% నిధులు మాత్రమే కేటాయించి విద్యకు అన్యాయం చేశారని అన్నారు. ఈసారి బడ్జెట్లోనైనా హామీ ఇచ్చినట్లు 15 శాతానికి మరో 5% కలిపి 20 శాతం నిధులను కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని సంక్షోభం నుండి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివిధ పాఠశాలలలో ఏర్పాటైన సమావేశంలో శoతన్ డిమాండ్ చేశారు. ఈ సభ్యత్వ పర్యటనలో జిల్లా ఉపాధ్యక్షులు రాసరి పెంటన్నతోపాటు మండల ప్రధాన కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

