- ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల వరుస మరణాలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఒత్తిడులు తగ్గించుకుంటు జర్నలిస్టులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. జిల్లాకు పసుపు బోర్డు సాధించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న అరవింద్ ను జర్నలిస్టులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సుభాష్ నగర్ లోని తన నివాసంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. ఇటీవల వివిద కారణాలతో మృతి చెందిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరుస మరణాలు బాధాకరమన్నారు. అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఆపద సమయంలో బీజేపీ నాయకులకు ఆదుకుంటున్నానని, ఫౌండేషన్ సేవలకు జర్నలిస్టులకు వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ కార్యకలాపాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఎంపీ ని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్, సీనియర్ జర్నలిస్టులు ప్రమోద్, ప్రసాద్, శ్రీనివాస్, దేవీదాస్,సుదర్శన్ ఆంజనేయులు,అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

