. . . మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య అత్యంత దురదృష్టకరం
. . . సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ఇందల్వాయి, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధి ఇందల్వాయి మండలం లింగాపూర్ – గౌరారం శివారులో జరిగిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి దారుణ హత్య దురదృష్టకరమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.రేకుల పల్లి భూపతి రెడ్డి అన్నారు. హత్య గావించబడిన ఇమ్మడి గోపి పార్థివదేహాన్ని గురువారం సాయంత్రం వారి గ్రామానికి వెళ్లి సందర్శించారు. ఆయన పార్థివదేహం వద్ద పూల మాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ రాష్ట్రస్థాయి నాయకుడు ఇమ్మడి గోపి హత్య వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. పార్టీలో చురుకుగా పాల్గొంటూ తన గెలుపు కోసం పనిచేశారని స్మరించుకున్నారు. బుధవారం రాత్రి పదిగంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా, అప్పటి నుండే నగర సిపి ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు తెలిపారు.

దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు దర్యాప్తు ప్రక్రియను నిష్పక్షపాతంగా చేపట్టాలని పోలీసులకు తెలిపారు. తెలంగాణలో హత్యారాజకీయాలను అస్సలు సహించేది లేదన్నారు. కాగా ఇమ్మడి గోపి అంత్యక్రియలు స్వగ్రామం గౌరారం గ్రామ పంచాయతీ లింగాపూర్ లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఇందల్వాయి, డిచ్ పల్లి మండలాల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్, అమృతాపూర్ గంగాధర్ ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
