. . . విద్యార్థులకు ఉర్దూ బోధనపై తల్లిదండ్రుల ఆగ్రహం
ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలో గల పెర్కిట్ ప్రాంతంలో గల భరత్ చంద్ర పాఠశాల వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ గా ఉర్దూ విద్యాభ్యాసం విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇంగ్లీష్, తెలుగు మీడియం సిలబస్తో నడుస్తున్న ఈ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న హిందూ విద్యార్థులకు గత 20 రోజులుగా ఉర్దూ విద్యాభ్యాసాన్ని బోధిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల పాఠశాలలో ఒక ముస్లిం వ్యక్తి ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ మార్పులు జరిగాయని విద్యార్థులచే తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు బీజేపీ, బజరంగ్దళ్, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల నాయకులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. “హిందూ పిల్లలకు ఉర్దూ విద్యాభ్యాసం ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే” అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ పిల్లలకు అదనంగా ఒక లాంగ్వేజ్ నేర్పించాలనే ఉద్దేశంతోనే ఉర్దూ బోధిస్తున్నామని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ సమాధానంపై తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. “మరి ముస్లిం పిల్లలకు హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను బోధిస్తున్నారా అని ప్రశ్నిస్తే పాఠశాల యాజమాన్యం వద్ద నుండి సరైన సమాధానం రాకపోవడంతో తల్లిదండ్రులు, నాయకులు ఆగ్రహోదగ్రులయ్యారు. దీనిపై ఎంఈఓకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని వారు వాపోయారు. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న సదరు పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఐ సత్యనారాయణ గౌడ్, రూరల్ సీ.ఐ. జాన్ రెడ్డి, ఆర్మూర్ సబ్ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, యాసార్, అర్ఫత్లు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులను సద్దుమణిగించి ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
