నందిపేట్, బతుకమ్మ :
మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలో మంగళవారం ఎస్ఐ వినయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 20 మంది వాహనదారులకు మొత్తం రూ.4,000 జరిమానాలు విధించారు. అదే విధంగా వాహనాలపై పెండింగ్లో ఉన్న చలానాలను 11 మంది వాహనదారుల నుంచి మొత్తం రూ.1,450 వసూలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు.