. రెగ్యులర్ అధికారి వచ్చేనా? ఇన్ చార్జీలే దిక్కా?
. రేపటితో ముగియనున్న ఇన్ చార్జి బాధ్యతలు
మాక్లూర్, బతుకమ్మ: మాక్లూర్ మండల పరిషత్ అధికారి ఎవరైనా వస్తారా? లేక ఇన్ చార్జీలతోనే నెట్టుకొస్తారా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇన్ చార్జి ఎంపీడీవోగా కొనసాగుతున్న ట్రెయినీ కలెక్టర్ బాధ్యతల కాలం ఈనెల 30తో ముగియనుంది. గతంలో పనిచేసిన అధికారిణి సైతం డిప్యూటేషన్ పై రెండేళ్లపాటు కొనసాగారు. సదరు అధికారిణిపై అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడంతో వాటి నుంచి బయటపడేందుకు పలుమార్లు ‘సెలవు’ అస్త్రాన్ని ప్రయోగించి చివరికి దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. దీంతో జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన ఐఏఎస్ అధికారికి కలెక్టర్ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఇన్ చార్జి ఎంపీడీవో బాధ్యతలు అప్పగించారు.
రెగ్యులర్ లేక ఇంచార్జ్
మాక్లూర్ మండలానికి రెగ్యులర్ అధికారి లేక ఏళ్లు గడుస్తోంది. ఇన్ చార్జీగా పని చేసిన ఐఏఎస్ బాధ్యతల కాలం ముగియడంతో ఇప్పటికైనా రెగ్యులర్ అధికారిని పంపించాలని మండల వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ చార్జి అధికారులు ఉంటే పనులు కావడం లేదంటున్నారు.
డిప్యూటేషన్ ఎంపీడీవో జగిత్యాల్ కు
జక్రాన్ పల్లికి రెగ్యులర్ ఎండీఓ గా ఉండి మాక్లూర్ కు డిప్యూటేషన్ పై వచ్చిన అధికారిని సెలవు నెపంతో వేరే దిక్కుకు ప్రయత్నాలు చేశారు. ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్న ఉన్నతాదికారులు పోస్టింగ్ ఇచ్చేందుకు వెనుకడుగు వేసినట్లు తెలిసింది. చివరకు జగిత్యాల్ జిల్లాకు పంపించారు.
