హైదరాబాద్, బతుకమ్మ :
నీట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నీట్లో సాధించిన విజయాలపై సీఎం విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్ విద్యా ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల విద్యా సంస్థలు అందిస్తున్న నాణ్యమైన విద్య, విద్యార్థుల ప్రతిభను సీఎం ప్రశంసించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ విద్యార్థులు జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షలో మంచి ఫలితాలు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, సిబ్బందిని కూడా అభినందించారు.
