. . . హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మార్మోగిన గ్రామం
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శనివారం శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ కంటేశ్వర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రను గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) చైర్మన్ రియాజ్, రథయాత్ర కమిటీ సభ్యులు కలిసి ప్రారంభించారు. ఈ రథయాత్రకు వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీ జగన్నాథ స్వామి రథాన్ని లాగుతూ భక్తులు “హరే రామ హరే కృష్ణ” నామస్మరణ చేస్తూ భక్తి భావంతో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, భజనలు, కీర్తనలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, అనంతరం ప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. రథయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై బి. సుమలత ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ రథయాత్రలో పాల్గొనాలని అధికారులు సూచించారు. రథయాత్ర ముగిసిన అనంతరం భక్తుల కోసం గంగపుత్ర ఫంక్షన్ హాల్లో భోజన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులందరూ గమనించి సహకరించాలని వారు కోరారు.

