- తప్పిన పెను ప్రమాదం
బతుకమ్మ నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆలయంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చండీయాగం చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

దేవాలయం నుంచి దిగువ భాగంలో గుట్టపై ఇటీవల కురిసిన వర్షాలకు మట్టికుంగి రిటైనింగ్ వాల్ పై ఒత్తిడి పెరగడంతో కూలిపోయింది. దాదాపు 30 పీట్ల పొడవులో గోడ కూలిపోయింది. 2022లో 23 కోట్ల రూపాయలతో నిర్మించిన దేవాలయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రెండు వర్షాకాలం కూడా రిటైనింగ్ వాల్ తట్టుకోకుండా కూలిపోవడంతో అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. కొండపైకి ఎవరిని అనుమతించకుండా పనులు చేపట్టడం గమనార్హం.
