. . . ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులో మాజీ కార్పొరేటర్ విశాలినిరెడ్డి పేరు
. . . ఇటుకల గోడ రేకుల కప్పు ఉందని ఇళ్ళు సాంక్షన్
. . . అధికారులను నిలదీసిన స్థానిక ప్రజలు
. . . సర్వే తప్పుల తడక : ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్ కార్పొరేటర్ స్రవంతిరెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్న వార్డు సభ రచ్చరచ్చ అయింది. ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం తర్వాత అర్హులైన వారికి రైతుభరోసా కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం వార్డు సభలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. నగరంలోని పాత అంబేద్కర్ భవన్ లో జరిగిన 23వ డివిజన్ వార్డు సభలో ప్రజలు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటి జాబితాలో స్థానిక మాజీ డివిజన్ కార్పొరేటర్ విశాలినిరెడ్డి పేరును 106 సీరియల్ నంబర్ లో పేర్కొనడం పట్ల ప్రజలు మండిపడ్డారు.

ఇది వరకు రెండుసార్లు కార్పొరేటర్ గా, గతంలో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త చామకూర ప్రభాకర్ రెడ్డి కొన్ని నెలల క్రితం వరకు నూడా చైర్మన్ గా పని చేశారు. వారిని ఇందిరమ్మ ఇండ్లకు లబ్దిదారుగా చేర్చడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిని ఏ విధంగా అర్హులుగా చేస్తారని మండిపడ్డారు. ఇండ్లు లేని పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేస్తే వారి జాబితా లేదని, తప్పులు ఉన్నాయని సర్వేలు చెబుతున్న అధికారులు ధనికులకు, రాజకీయ నాయకులకు, సొంత భవనాలు కలిగిన వారికి, వ్యాపారం చేసే వారికి అర్హుల జాబితాలో ఎలా చేరుస్తారని అధికారులను నిలదీశారు. విషయం తెలిసిన స్థానిక కార్పొరేటర్, ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ డివిజన్ చైర్మన్ స్రవంతిరెడ్డి అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు చెత్తబుట్టపాలు చేశారని మండిపడ్డారు. అనర్హులను ఏ విధంగా జాబితాలో చేర్చారని సర్వే అంతా బూటకమని అన్నారు. సర్వే అంతా కాంగ్రెస్ నాయకుల కనుసన్నుల్లో జరిగిందని, అర్హులను వదిలేసి కాంగ్రెస్ కార్యకర్తలకు, వారి సానుభూతిపరులకే ఇచ్చారనడానికి మాజీ కార్పొరేటర్ పేరు జాబితాలో ఉండడమే నిదర్శనమన్నారు. తక్షణం అధికారులు అర్హుల జాబితాను పున:పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు.

