. . . నడి ఎండలో బైఠాయించి ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవిత, విశారదన్ మహరాజ్, రైతులు
. . . పోలీసులతో కవిత, విశారదన్ వాగ్వాదం
వికారాబాద్, బతుకమ్మ :
బలవంతపు భూసేకరణ ను నిలిపివేసే వరకు ఉద్యమిస్తామని, ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే అక్కడ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ పోరాడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను నిర్బంధంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ బుధవారం వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ను కాల్చి బూడిద చేసిన సరే ఈ పాపం పోదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెనం మీద ఉంటే ఇప్పుడు పొయ్యిలో పడినట్టుగా రైతుల పరిస్థితి ఉందని అన్నారు. పరిశ్రమల కోసం పరిగిలో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, కల్లాపూర్, రాపోల్, భట్ల చందారం సహా పలు గ్రామాల్లో రైతుల భూములను గుంజుకుంటున్నారని, ఆయా గ్రామాల్లో మొత్తం భూమిని తీసుకుంటున్నారని, ఆ రైతులకు మరో దిక్కు లేని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఇక్కడ రైతుల బాధ రాష్ట్రం మొత్తానికి తెలియాలనే వికారాబాద్ లో ఆందోళన చేపట్టామని, వికారాబాద్ లో రైతులు ఎండలో కూర్చొని ధర్నా చేస్తుంటే…నిజామాబాద్ లో పసుపు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నారన్నారు.

ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులు సంతోషంగా లేరని, కొంతమంది రైతులకు మద్దతు ధర లేదు, కొంతమందికి రుణమాఫీ జరగలేదు, కొన్ని చోట్ల యూరియా లేదని వాపోయారు. అది చాలదన్నట్లుగా చిన్న, సన్నకారు రైతుల భూములు లాక్కుంటూ వారిని గోస పెడుతోందని, ఇక్కడి రైతులకు ఎన్నో ఏళ్ల క్రితమే ప్రభుత్వం భూములు ఇచ్చిందని, ఇప్పుడు ఆ భూములను లాక్కోవటం అంటే రైతుల నోటికాడ బుక్క లాక్కోవటమే అని బాధపడ్డారు. ఇక్కడ రైతుల నుంచి దాదాపుగా 12 వందల ఎకరాలు తీసుకుంటున్నారని, అందులో వెయ్యి ఎకరాల వరకు కూడా అసైన్డ్ భూములే అని, మిగతా 2 వందలకు పైగా ఎకరాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులవే అని తెలిపారు. ఈ ముఖ్యమంత్రి ఒక పక్క మూసీ బాగు చేస్తా అని హైదరాబాద్ లో చెబుతుంటాడని, మరో పక్క మూసీ నెత్తి మీద ఫ్యాక్టరీలు పెట్టి కాలుష్యాన్ని మూసీలోకి తెస్తున్నాడని, కనీసం ఇక్కడ ఏర్పాటు చేసే ఫ్యాక్టరీల్లో మనవాళ్లకు ఉద్యోగాలు ఇస్తారా అంటే అది లేదని పేర్కొన్నారు.

రైతులకు రైతు భరోసా లేదని, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయం లేదని, ఇస్తామన్న మాట కల్లస్, చేస్తామన్న పనులు మటాష్ అని అన్నారు. మరో పది రోజుల్లో ఈ గడ్డ మీదకు మరో ప్రాంతీయ పార్టీ రాబోతోందని, పార్టీ ఏర్పాటు తర్వాత మరిన్ని ఉద్యమాలు చేస్తూ మీ పక్షాన పోరాటం చేస్తామని, ఎక్కడ రైతుల భూములు గుంజుకుంటే అక్కడ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఉంటుందని తెలిపారు. మన సమస్యలపై పిడికిలి ఎత్తి పోరాటం చేస్తేనే పరిష్కారం లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పిడికిలెత్తి పోరాటం చేయటం ద్వారానే సాధించుకున్నామని గుర్తు చేశారు.

. . . రైతుల సమస్యపై వికారాబాద్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన కవిత
ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని వికారాబాద్ కలెక్టర్ కు కవిత స్పష్టం చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ధర్నాకు దిగిన కవితకు నచ్చచెప్పేందుకు స్వయంగా ఫోన్ చేసి కలెక్టర్ మాట్లాడారు. రైతులకు స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని కవిత స్పష్టం చేశారు. కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ లేకపోవటంతో కవిత ఆందోళన కొనసాగిస్తున్నారు.

. . . కవిత, విశారాదన్ మహారాజ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు
కలెక్టర్ తో మాట్లాడిన అనంతరం ధర్నా విరమించకుండా కొనసాగించినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారాదన్ మహారాజ్ లను అరెస్ట్ చేసి వికారాబాద్ జిల్లా బంటారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.