- కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్ఠం చేయాలి
- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్
మోర్తాడ్,బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉండాలని, ప్రజల సమస్యలను తీర్చలేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. సోమవారం లలితా గార్డెన్స్ లొ జరిగిన మోర్తాడ్, కమ్మర్ పల్లి, ఏర్గట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో తాను ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని నమ్మి వేల మంది ఓట్లు వేశారని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకాభిప్రాయంతో గ్రామ మండల నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అని సకలజనుల మేలుకొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రభుత్వమందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా చూసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
అవసరమైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని అర్హత ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రేషన్ కార్డులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఇప్పటికే ఎంతోమంది పేర్లు రేషన్ కార్డులలో చేర్చబడ్డాయని తెలిపారు.
భారీ వర్షాలకు కొనుగోలు జరుగుతున్న సమయంలోనే వరి ధాన్యం తడిసిపోయిందని తడిసిన ప్రతి గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ మేరకు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయని వర్షంలో కూడా ఇప్పటివరకు కొనుగోళ్లు ఆగలేదని ఆయన తెలిపారు.
ధాన్యం కొనుగోలు తర్వాత వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని త్వరలోనే బోనస్ కూడా రైతులకు అందుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు త్వరితగతిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందుతున్నాయని ప్రజలంతా ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ పర్యవేక్షకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మండల మోహన్ రెడ్డి, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీసి ఎస్సి ,ఎస్టి ,మైనారిటీ అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
