బతుకమ్మ, వేల్పూర్: రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ సీజన్ లో రైతు భరోసా ఇవ్వలేమని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలలలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఎన్నికలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. గత సీజన్ లో రైతుబంధు కూడా రేపు మాపు అంటూ ఇవ్వలేదని. ఇప్పుడు ఈ సీజన్లో రైతు భరోసా కూడా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడిన రైతులను నమ్మించి మోసం చేసినట్టని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను మళ్లీ మోసం చేసిందన్నారు. పంట పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో పండుగ అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దండగనే విధంగా ఉందన్నారు. రుణమాఫీ లేదు, కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు, రైతులన్నీ గమనిస్తున్నారని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
