. . . పశువులకు తాగునీటి సమస్య సృష్టించారంటూ మత్స్య సంఘంపై గ్రామస్తుల ఆగ్రహం
ఇందల్ వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామంలో చెరువుకు సంబంధించిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోని ఏకైక చెరువులోని నీటిని అక్రమంగా విడుదల చేసి, పశువులకు తాగునీటి సమస్య సృష్టించారని ఆరోపిస్తూ రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు తిర్మన్పల్లి గ్రామాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గ్రామంలోని చెరువు పశువుల తాగునీటి ప్రధాన ఆధారం. అయితే చేపల పెంపకం నిర్వహిస్తున్న మత్స్య సంఘం చెరువులోని నీటిని పూర్తిగా వదిలేయడంతో గేదెలు, పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మత్స్య శాఖ నిబంధనల ప్రకారం చేపల పెంపకంలో భాగంగా పశువులకు అవసరమైన నీటిని తప్పనిసరిగా నిల్వ ఉంచాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలు పట్టించుకోలేదని గ్రామస్థులు తెలిపారు. అంతేకాకుండా, చెరువులో మిగిలిన కొద్దిపాటి నీరు కూడా కలుషితమై పశువులు తాగడానికి పనికిరాని స్థితికి చేరుకుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు గట్టుపై చేపల కార్యకలాపాల వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణానికి కూడా నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించి, నిబంధనలు ఉల్లంఘించిన మత్స్య సంఘంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మత్స్య సంఘానికి ఇచ్చిన లీజును వెంటనే రద్దు చేయాలని కోరారు. గ్రామ ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి చెరువులో నీటి నిల్వను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

