- అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శబ్ద కాలుష్యం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లను అక్రమంగా బిగించుకున్న వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో పట్టుబడిన 350 మాడిఫైడ్ సైలేన్సర్లను సీజ్ చేసి బుధవారం నగరంలోని రైల్వే స్టేషన్ ముందు అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. మాడిఫైడ్ సైలెన్సర్లను అక్రమంగా బిగించుకున్న వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని, మునుముందు కూడా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్ బిగించుకొని ప్రజల ప్రశాంత వాతావరణం, మానసిక స్థితి, ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం చూపేటువంటి మాడిఫైడ్ సర్వీస్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. మోడీఫైడ్ సైలెన్సర్స్ బిగించే వ్యాపారులపైన చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. మోటార్ వాహన సవరణ చట్టం 2019 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి మొదటిసారి పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని అన్నారు. మొదటిసారి పట్టుబడిన తర్వాత మూడు సంవత్సర కాలంలో మరొకసారి పట్టుబడినట్లైతే రెండవసారి పదిహేను వేల రూపాయలు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలని, ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏసిపి మస్తాన్ అలీ, నిజాంబాద్ డివిజన్ ఏసిపి రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఆర్ఐ సురేష్, శ్రీనివాస్, వినోద్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


