కాచాపూర్, బతుకమ్మ :
డీజేలకు దూరంగా.. సంప్రదాయ డప్పు వాయిద్యాలకు దగ్గరగా గణేష్ నిమజ్జన వేడుకలను నిర్వహిస్తూ కాచాపూర్ గౌడ యువ సేన యువకులు ప్రత్యేకంగా నిలిచారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో సంప్రదాయ డప్పు చప్పుళ్లకు విశేష ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. ఇటీవల కాలంలో విపరీతమైన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న ఆధునిక డీజే సౌండ్ సిస్టమ్స్ బదులుగా మన సంప్రదాయ డప్పు వాయిద్యాల వైపు భక్తులు మొగ్గు చూపుతున్నారనడానికి కాచాపూర్ గౌడ యువ సేన చేపట్టిన కార్యక్రమం చక్కటి నిదర్శనంగా నిలిచింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో గౌడ యువ సేన యువకులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా డప్పు చప్పుళ్ల మధ్య వినాయకుడిని ఊరేగించారు. పలువురు యువకులు నృత్యాలు చేస్తూ గణనాథుడి ఊరేగింపును సందడిగా నిర్వహించారు. డీజేలకు బదులుగా డప్పు వాయిద్యాలను ఉపయోగిస్తూ తమ సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశాన్ని చాటారు.గ్రామీణ, పట్టణ సంస్కృతిలో డప్పు వాయిద్యం ఒక ప్రత్యేక ప్రతీకగా నిలుస్తోంది. గణనాథుడి వీడ్కోలు వేడుకల్లో డప్పుల చప్పుళ్లు భక్తుల్లో భక్తితో కూడిన ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో గౌడ యువ సేన యువకులతో పాటు గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
