. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
. . . ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ లోని అన్ని డివిజన్ ల పరిధిలో టీఓఎస్ఎస్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏప్రిల్ 20 నుండి 27 వరకు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 5:30 వరకు జిల్లాలోని మొత్తం 27 పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమని తెలిపారు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్ నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకురావడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ సీపీ విద్యార్థులకు “ ఆల్ ది బెస్ట్ ” తెలిపారు.
