. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య
. . . ఆటో , అంబులెన్సు డ్రైవర్స్ కు అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం లో సీపీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి పాంప్లెంట్లు, పోస్టర్లను విడుదల చేసారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి జే.ఉమామహేశ్వరరావు, నిజామాబాద్ ఇన్ చార్జి ఏసిపి రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్, టౌన్ వన్ ఎస్ హెచ్ ఓ రఘువీర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ వి.వి సుబ్బారావు, మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ కిరణ్ కుమార్, జి.ఆర్.పి ఎస్ హెచ్ ఓ లింబాద్రి , టౌన్ వన్ ఎస్సై సుమలత, 34వ డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రీతి, ప్రవీణ్ కుమార్, ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

