– కీలక సమయాల్లో పనిచేయని నిఘా
– పోలీస్ స్టేషన్ లో పనిచేయని డివిఆర్
– పట్టించుకోని అధికారులు
రుద్రూర్,బతుకమ్మ:
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని నిత్యం పోలీసు అధికారులు చెబుతుంటారు. దోపిడీలను అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు, దాతలు, వ్యాపారులు, గ్రామస్థుల సహయంతో, గ్రామ అభివృద్ధి కమిటీలను ప్రోత్సహించి గతంలో పోలీస్ అధికారులు రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అయితే వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. నేర నియంత్రణలో కీలకంగా పనిచేసే నిఘా నేత్రాలు ఇప్పుడు మరమత్తుల దశకు చేరడంతో వాటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఎక్కడైనా చోరీ గానీ, ప్రమాదం గానీ జరిగినప్పుడు నిందితులను గుర్తించడం సవాల్ గా మారుతుంది. బస్టాండ్ సమీపంలోని దుకాణాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాల పై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.
– కీలక సమయాల్లో పనిచేయని నిఘా
ఇటీవలే బస్టాండ్ ప్రాంగణంలోని ఎస్ బి ఐ ఏటిఎంలో, కోటగిరికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గల వైన్స్ షాపులో, అంగడి బజారులోని కిరాణా దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన విషయం విధితమే. స్థానిక పోలీస్ స్టేషన్ లో సిసి ఫుటేజ్ కూడా పనిచేయడం లేదని, సిసి ఫుటేజీ పనిచేయకపోవడంతో ఆధారాలు, సాక్ష్యాలు లభించక నిందితులను గుర్తించలేకపోతున్నారు. సీసీ కెమెరాలు మరమ్మతుల దశకు చేరడంతో వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వలన కొన్ని కేసుల్లో వేగంగా దర్యాప్తు, విచారణ సాగడం లేదు. కీలక సమయాల్లో సీసీ కెమెరాల్లో నిక్షిప్తంగా కానీ నిందితుల గుర్తింపు కష్టతరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలకు మరమ్మత్తులు చేయించాలని స్థానిక ప్రజలు కోరారు.

