ఒకే ఇంట్లో నలుగురు మృతి
ఆలస్యంగా వంద విమానాలు
ఢిల్లీ, బతుకమ్మ : దేశ రాజధాని ఢిల్లీని మండుటెండల్లో వాన వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ- ఎన్ సీఆర్ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 40 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షానికి ద్వారకలో ఓ ఇంటిపై చెట్టు కూలిపోయింది. దీంతో ఆ ఇంట్లో నివాసం ఉండే నలుగురు మృతి చెందారు. ఒకే ఇంట్లో తల్లి, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈదురు గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమ య్యాయి. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.