కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల బ్యారక్ లను తనిఖీ చేసి, వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ విభాగంలో నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు ఇచ్చారు. స్టేషన్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు. స్థానిక ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన అన్నిరకాల ముందస్తూ ఏర్పాట్లను చేసుకోవాలని, గత ఎన్నికలలో చెడు నడత కలిగిన వారిని ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిదిలో గల పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లోకేషన్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ ను తప్పనిసరిగా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఉండాలని, పోలింగ్ కేంద్రాలలో ఉండవలసిన కనీస వసతుల గురించి సమాచారం అందించాలన్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు , కళాశాలలో , సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పోలీస్ స్టేషన్ జిల్లా బోర్డర్ సరిహద్దు లో ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై నిఘా వ్యవస్థ పటిష్ట పరిచి అక్కడి పోలీసు సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు జారిచేసారు. అధికారులు మరియు సిబ్బంది 24 గంటల పాటు తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని , దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.ఈ తనిఖీలో భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కమ్మర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.అనిల్ రెడ్డి , హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లు తదితరులు పాల్గొన్నారు.

