- రాష్ట్రంలో పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు
- రాష్ట్ర పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫైర్
హైదరాబాద్, బతుకమ్మ : ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది. రాష్ట్ర పార్టీ అధిష్టానం ఏం చేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో వెంకటరమణారెడ్డి రాష్ట్ర అధిష్టానంపై ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్న సమావేశంలోనే వెంకటరమణారెడ్డి నాయకత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీశారు. పార్టీ ఆఫీసులో కూర్చోని మాట్లాడితే సరిపోతుందా , క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోరా అని ప్రశ్నించారు. మీరు పెట్టే సమావేశాలకు రావడం, వెళ్లడమే మా పనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవని నాయకత్వంపై ప్రశ్నలు వర్షం కురిపించారు.

