బతుకమ్మ, బిచ్కుంద : జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తెలిపారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు రోడ్ల పై నీరు చేరిన ప్రాంతాల్లో, బ్రిడ్జిలు, నీటి ఓవర్ ఫ్లో ప్రాంతాల యందు, రవాణా సౌకర్యాలు నిలిపివేయాలని సూచించారు. వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో జాలర్లు చేపల వేటకు వెళ్లకపోవడమే ఉత్తమమన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కాచివడపోసిన నీటిని మాత్రమే తాగాలని ఆయా గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు తెలియజేయలన్నారు. గ్రామ కార్యదర్శులు, మండల అధికారులు ఎమ్మార్వో, ఎస్సై లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. మండల స్థాయిలో ఒక కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని, మండలాల వారీగా ఎప్పటికప్పుడు తగిన సమాచారం జిల్లా యంత్రంగానికి జిల్లా కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ కి విధిగా అందించాలని ఆయన సూచనలు చేశారు.
