- సైబర్ నేరగాళ్లను ఉపేక్షించేదిలేదు
- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, బతుకమ్మ : నిరుద్యోగ యువతకు విదేశాలలో ఉద్యోగం ఇస్తామని మోసం చేసే వారిచేత సైబర్ నేరాలు చేయిస్తున్న ఒకరిపై పి.డి యాక్ట్ నమోదు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొంత మంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తాము అని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు యువతకు మంచి ఉద్యోగాలు, అధిక వేతనాలు ఇస్తామని చెప్పి, వారిని లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించేవాడు. అక్కడకు వెళ్లిన తర్వాత వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకుని చట్ట విరుద్దమైన సైబర్ మోసాలకు బలవంతంగా పని చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జీడిమెట్ల లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన కోలనాటి నాగశివపై పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అతనిపై కేసులు నమోదు చేశారు. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఇందుకు గాను ప్రధాన సూత్ర దారుడైన కోలనాటి నాగశివ ఈనెల 13న పి.డి యాక్ట్ 1986 తెలంగాణ (ప్రివెన్షన్ డిటెన్షన్) ను ప్రయోగించి ఇతనిని చెంచల్ గూడా జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ విధంగా ఎవ్వరయిన యువతను అధిక వేతనాలతో కూడిన ఉద్యోగలు ఇప్పిస్తామని, మోసపూరితమైన వాగ్దానాలు చేసి యువతను నమ్మించి విదేశాలలో ఉద్యోగాల పేరిట ఉద్యోగం కల్పిస్తాము అని చెప్పే సైబర్ నేరగాళ్లను ఉపేక్షించేదిలేదు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హెచ్చరించారు.
