. . . కామారెడ్డి జిల్లా ఒలంపిక్ చైర్మన్ డాక్టర్ జైపాల్ రెడ్డి
. . . కామారెడ్డి జిల్లా లో విజయవంతంగా ఒలింపిక్ డే రన్
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థి క్రీడలలో పాల్గొనాలని, రాబోయే కాలంలో కామారెడ్డి జిల్లా నుండి ఒలంపిక్స్ స్థాయికి ఎదగాలని కామారెడ్డి జిల్లా ఒలంపిక్ చైర్మన్ డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డిలో ఒలంపిక్ రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒలంపిక్ చైర్మన్ అధ్యక్షతన కామారెడ్డి బాయ్స్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సుమారు 2000 పైగా విద్యార్థులతో శిశు మందిర్ వరకు చేరుకుంది.

జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జడ్జి నాగరాణి, ఎస్పీ రాజేష్ చంద్ర, గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఒలంపిక్ రన్ లాంటి కార్యక్రమాల పట్ల అవగాహన కలిగించాలన్నారు. దీని వల్ల వారికి క్రీడా స్పూర్తి, దేశభక్తి, క్రమశిక్షణతో పాటు ఫిజికల్ ఫిట్ నెస్ అందుతాయని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు ఆటల పట్ల కూడా ప్రేరేపించాలని తెలియజేశారు. ఎస్పీ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని గుర్తు చేస్తూ, విద్యార్థుల చేత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రార్థన చేయించారు.

అనంతరం ఒలంపిక్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ తన మీద నమ్మకంతో చైర్మన్ చేసినందుకు, జిల్లాలోని అధికారులు, టీచర్లు స్కూలు విద్యార్థులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగలిగామన్నారు. ఒలంపిక్స్ అనేవి ప్రపంచంలోనే అతి గొప్పవని వాటి స్ఫూర్తిగా నిర్వహిస్తున్నటువంటి రన్ లో భాగంగా మనం కామారెడ్డిలో 40వ ఒలంపిక్ రన్ ను నిర్వహించడం జరిగిందని తెలిపారు.

అనంతరం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన పీఈటిలకు, పీడీలకు, ప్రతి స్కూల్ యొక్క ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, యాజమాన్యాలకు, ఎడ్యుకేషన్, రెవెన్యూ, పోలీస్, హెల్త్, మున్సిపల్ శాఖల అధికారులందరికీ దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్, గిరి, డీఈఓ మల్లికార్జున్, ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నోడల్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్, డివైఎస్ఓ రంగా వెంకటేశ్వర్ గౌడ్, డి ఎస్ ఓ సిద్దరాంరెడ్డి, ఎక్సైజ్ సూపరెంటెండెంట్ హన్మంత్ రావు, ఫైర్ ఆఫీసర్ సుధాకర్, డి ఎస్ పి, సి ఐ లు, ఎస్సై లు, కన్వీనర్ గా ఉన్న అనిల్ కుమార్, సభ్యులు మధుసూదన్ రెడ్డి, సాయి మౌర్య, సందీప్ గౌడ్, ఇతర జిల్లా అధికారులు వారితో పాటు యువకులు, ఎన్ సిసి క్యాడేట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

