బతుకమ్మ, నాగిరెడ్డిపేట : కలియుగ అవతార పురుషుడు, తరతరాలకు దార్శనికుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని నాగిరెడ్డిపేట మాజీ ఎంపీపీ దివిటి రాజ్ దాస్ కొనియాడారు. బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 102 వ జయంతిని నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి మాజీ ఎంపీపీ దివీటి రాజ్ దాస్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కూడా ప్రయాణికులకు, ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్ దాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ నిరుపేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం తో పాటు, మరెన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయరంగంలో, సినీ రంగంలో ఎన్నో విశిష్టమైన సేవలు అందించారని, ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మండల మాజీ జెడ్పిటిసి జయరాజ్, నాయకులు రామకృష్ణయ్య, మోహన్ గౌడ్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

