కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలోని వివిధ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్డీపీఎస్ చట్టం పరిధిలో నమోదైన 71 కేసుల్లో పట్టుబడిన నిషేదిత మత్తుపదార్థాలను దహనం చేశారు. నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతురావు ఆధ్వర్యంలో 1285.25 కిలోల ఎండుగంజాయి, 32.585 కిలోల అల్ర్పాజోలం, 71.845 కిలోల డైజోఫాం, 114 గంజాయి మొక్కల విలువ రూ.7 కోట్ల 98 లక్షల 70 వేల 250 ఉంటుందని వాటిని నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో గల మేడికేర్ సర్వీస్ కెమికల్ ఫ్యాక్టరిలో ధ్వంసం చేసి దహనం చేసినట్లు కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్లు విజయ్ కుమార్, మధుసూదన్ రావు, షకీర్ హైమద్, సత్యనారాయణ, ఎస్సైలు విక్రమ్ కుమార్, నగేష్, సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో 58 లక్షల విలువైన నిషేదిత మత్తు పదార్థాల ధ్వంసం
నిజామాబాద్ జిల్లాలో 40 ఎన్డీపీఎస్ కేసులలో దొరికిన 58 లక్షల విలువైన మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలోని మేడికేర్ సర్వీస్ కెమికల్ ఫ్యాక్టరిలో 548. 15 కిలోల ఎండు గంజాయి, 3.353 కిలోల అల్ప్రాజోలంను దహనం చేసినట్లు ఈఎస్ మల్లారెడ్డి తెలిపారు.

