నిర్మల్, బతుకమ్మ :
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతలబోరి గ్రామంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్య హక్కు పరిరక్షణ, బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించే లక్ష్యంతో డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, చైల్డ్ లేబర్ ప్లాట్ఫారం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలను పనుల్లోకి కాకుండా పాఠశాలల్లో చేర్పించి వారి విద్యాభ్యాసానికి ప్రతి కుటుంబం సహకరించాలని, బాలల హక్కులను పరిరక్షించేందుకు గ్రామస్థులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు విజయ్ మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం గ్రామస్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని తిరిగి విద్యా ప్రవాహంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీయూపీఎస్ స్థానిక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ భూమేష్, అంగన్వాడీ టీచర్ పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, ప్రతి బాలుడికి విద్య హక్కు కల్పించడం, బాలల భవిష్యత్తును విద్య ద్వారానే నిర్మించవచ్చనే సందేశాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేశారు.
