నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని 5వ టౌన్ పరిధిలోని బ్రహ్మణ కాలనీలో భారీ చోరీ జరిగింది. వారం రోజుల వ్యవధిలో రెండవది కావడం గమనార్హం. నాగారంలో గల బ్రహ్మణకాలనీలో పవన్ శర్మ అనే పూజారి ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి పవన్ శర్మ పూజ కోసం ఇంటికి తాళం వేసి వెళ్లగా ఈ చోరి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి ఇంటితాళం పగులగొట్టి బీరువా లాకర్ ను బద్దలు కొట్టారు. లాకర్ లోని 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు పవన్ శర్మ పూజ నుంచి తిరిగి వచ్చి చోరి జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. 5వ టౌన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే అరకోటికి పైగా విలువైన సొత్తు చోరికి గురి కావడం కలవరపెడుతుంది. దసరా పండుగ వేళ ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఓ వైపు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే గంటల వ్యవధిలోనే దొంగలు ఇళ్ళను గుల్లా చేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇంటికి తాళం వేసిన విషయం కూడా తెలిసిన వారే చోరికి పాల్పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
