. ముగ్గురు ఇమామ్ లకు తీవ్ర గాయాలు
. హైదరాబాద్ కు ఒకరి తరలింపు
. మరో ఇద్దరికి నిజామాబాద్ లో చికిత్స
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కారును లారీ ఢీకొట్టిన ఘటనలో మదర్సా విద్యార్థి ఒకరు మృతి చెందగా, ముగ్గరు ఇమామ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నగరంలోని ఆయా మజీదుల్లో ఇమామ్ లుగా పని చేస్తున్న అయూబ్ మౌలానా, హఫీజ్, షౌకత్ రజాతోపాటు మదర్సా విద్యార్థి, కార్పెంటర్ అబ్దుల్ రహమాన్ హైదరాబాద్ లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున బీబీపూర్ తండా వద్ద గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అబ్దుల్ రహమాన్(24) అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయూబ్ మౌలానా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు హఫీజ్, షకత్ రజా నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న మాజీ కార్పొరేటర్ మహ్మద్ షాబాజ్, మాజీ కౌన్సిలర్ మహ్మద్ రియాజ్ తదితరులు జీజీహెచ్ కు చేరుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


