- అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. గురువారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం చైర్మన్ గడ్డం ఇందుప్రియ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో వీధి దీపాల నిర్వహణపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వీధి దీపాలు రాకపోవడం పట్ల కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి వీధి దీపాలు రావడం లేదన్నారు. లైట్లు ఎప్పుడు బాగు చేయిస్తారని నిలదీశారు. గత కౌన్సిల్ లో జనరల్ ఫండ్ నుంచి 10 లక్షలతో వీధి దీపాలు కొత్తవి కొనుగోలు చేయాలని తీర్మానం చేసినా పట్టించుకోరా అని నిలదీశారు. సీడీఎంఏతో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఉందని,కొత్తవి కొనుగోలుకు సీడీఎంఏ అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. కొత్త వాటికి కాంట్రాక్టర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. పట్టణం చీకటిగా ఉంటే ఎలా అని మున్సిపల్ డీఈని నిలదీశారు. కాంట్రాక్టర్ కు అడిగితే కోట్లు రావాల్సి ఉందంటున్నారని పేర్కొన్నారు. కొత్త వీధి లైట్లు కొనుగోలు కోసం తీర్మానం చేసినా సీడీఎంఏ ఒప్పుకోవడం లేదని అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు. మూడు నెలలుగా వీధి లైట్లు వెలగడం లేదని,ఇలాగైతే వార్డుల్లో దొంగతనాలు జరిగితే ఎవరు బాద్యులని ప్రశ్నించారు. దీంతో అధికారులు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కౌన్సిలర్లు శాంతించారు.
