నిజామాబాద్, బతుకమ్మ: ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలను అందించాలన్నారు. ధర్పల్లి మండలం సీతాయిపేట్ లో ఇంటింటి కుటుంబ సర్వే తీరును కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఇళ్లను సందర్శించి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అతికించిన స్టిక్కర్లను చూసి, వాటిపై నమోదు చేసిన ఇంటి నెంబరు, ఎన్యుమరేషన్ బ్లాక్, క్రమ సంఖ్య తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఈ నెల 6,7,8 తేదీల్లో మూడు రోజుల పాటు హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 9 నుంచి సమగ్ర కుటుంబ వివరాల సేకరణ ప్రారంభమవుతుందని వివరించారు. సర్వే బృందానికి నిర్ణీత సమాచారాన్ని అందజేసి జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతానికి అన్ని వర్గాల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు.
