. . . జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ
. . . పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
సిట్ విచారణ పేరుతో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు పంపించడం ఆయనను అవమానించినట్లనని, ఆయన ఇంటికి నోటీసులు అతికించడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1500 బైక్ లపై నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నిజామాబాద్ అర్బన్ మాజీ గణేష్ బిగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్లమ్మ గుట్ట చౌరస్తా నుండి నిఖిల్ సాయి చౌరస్తా, పులాంగ్ మీదుగా రాజ రాజేంద్ర చౌరస్తా, గాంధీ చౌక్, పాత కలెక్టరేట్ మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు నల్ల జెండాలు, బీఆర్ఎస్ జండాలతో ర్యాలీగా నిరసన తెలిపారు. ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు సిద్ధం చేసిన దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని పోలీస్ వ్యాన్ లో వేశారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరగగా పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ చేసిన నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, గణేష్ బిగాల కలిసి నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కార్యకర్తలకు అండగా మేమున్నామంటూ ధైర్యం చెప్పారు.
