. . . జిల్లాలో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం
. . . ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యా రంగ సమస్యల పరిష్కారంతో పాటు విద్యార్థుల్లో జాతీయ భావన, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషిస్తోందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగరంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు చేతుల్లో ఏబీవీపీ జెండాలు పట్టుకుని, “భారత్ మాతా కీ జై”, “క్షణం క్షణం మా కణం క్షణం భారతమాతకే సమర్పణం” వంటి నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ఉత్సాహంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీతో నగరంలోని ప్రధాన రహదారులు విద్యార్థుల నినాదాలతో మారుమోగాయి. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ 1949 జూలై 9న స్థాపించబడిన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందన్నారు. “జ్ఞానం – శీలం – ఏకత” అనే నినాదంతో కోట్లాది మంది విద్యార్థులను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తోందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో విద్యార్థి లోకాన్ని మరింత ఏకం చేసి ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలకు సిద్ధమవుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందువు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అమృత చారి, నగర సంఘటన మంత్రి శివ ప్రసాద్, కంటేశ్వర్ జోనల్ ఇన్చార్జ్ దుర్గదాస్, సాయికుమార్, రక్షిత్, బాలకృష్ణ, సన్నీ, స్నేహిత్, చెర్రీ, లక్కీ, దీపన్, రాజ్కుమార్, దినేష్, రిచిత్తో పాటు పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

