- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మహబూబాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్ లో నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహబూబాబాద్ లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసిఆర్ ఫోబియా పట్టుకుందన్నారు. మైక్ పట్టగానే కేసీఆర్ ను తిట్టడం మించి రేవంత్ రెడ్డికి ఇంకో ఆలోచన రాదని అన్నారు. ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నిఅందరూ 10 పర్సెంట్ సర్కార్ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. పలాన చోట పర్సెంటేజీ ఇస్తే పని చేస్తున్నారని కొంత మంది చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన జరగడం లేదన్నారు. మహిళలకు 2500 ఇవ్వలేదు కానీ ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయడంలో లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే.. కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయవద్దని సూచించారు. బస్సుల సంఖ్య పెంచాలని, అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయని తెలిపారు.

అటో డ్రైవర్ల జీవనోపాధికి ఏడాదికి రూ 12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేవలం రాజకీయం తప్పా పరిపాలనపై రేవంత్ సర్కారుకు దృష్టి లేదని విమర్శించారు. గిట్టుబాటు ధరలేక మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పండిందన్నారు. ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడితే మద్ధతు ధర కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే దాన్ని సందర్శించే టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని, కాని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలు మిర్చికి రూ 25 వేల మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

- ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామానికి చెందిన చిర్రా సతీష్ కుటుంబం 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ కార్యకర్త, కెసిఆర్ వీరాభిమాని. చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉన్న సతీష్ డిగ్రీ పూర్తి చేశారు. అయితే, స్వయం ఉపాధి కోసం జిరాక్స్ మిషన్, లాప్టాప్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతానని ఇటీవల కెసిఆర్ జన్మదినం రోజున ఎమ్మెల్సీ కవితకు సతీష్ మెసేజ్ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన స్వయం ఉపాధి కావలసినవి సమకూర్చారు. జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందించడమే కాకుండా దాన్ని సోమవారం ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.

