కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలోని కేంద్ర రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి అక్రమ రవాణాను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల వివరాల ప్రకారం, సంబల్పూర్ నుంచి నాగవల్లి వైపు వెళ్తున్న రైలులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కామారెడ్డి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన సామాను పరిశీలించగా 48 కిలోల గంజాయి బయటపడింది. ఈ కేసులో రోహిత్ (21) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి పూణేకు గంజాయిని తరలించే ప్రయత్నం జరుగుతుండగా ఎక్సైజ్ శాఖ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అక్రమ రవాణాను అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
