నిజామాబాద్, బతుకమ్మ: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువ దినోత్సవం సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో ఆదివానం జూబ్లీహిల్స్ రూట్స్ కాలేజీలో ఘనంగా యువ రైతు పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రూట్స్ కాలేజీ అధినేత భిక్షపతి పడాల హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువ రైతులకు పురస్కారాలు అందజేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ యువ రైతులు సంఘటితం అయి కొత్త రకపు వ్యవసాయాన్ని చేయాలని సూచించారు. భిక్షపతి పడాల మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భావి తరాలకు శుభ పరిణామం అని అన్నారు. సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ మాట్లాడుతూ దేశమంటే మట్టి ,మనుషులు మాత్రమే కాదు యువకులు,రైతులు అని,యువకులు రైతులుగా మారి వ్యాపార దోరణిలో బంగారాన్ని పండిస్తే మన దేశం విశ్వ గురువుగా మారుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ శ్రవణ్ మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతు, యువ రైతులంతా జై జవాన్, జై కిసాన్ అనే నినాదం తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే జనవరి 12 తేదీని కేంద్ర ప్రభుత్వం యువ రైతు దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీ రాష్ట్ర యువ నాయకుడు రాజేష్ శామీర్ పెట్ మాట్లాడుతూ యువకులు సరైన దిశలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురస్కారాలు పొందిన యువ రైతులు ముఖ్య అతిథులతో వారి వ్యవసాయం గురించి చర్చ గోష్టి చేయటం విశేషం.

