- పసుపు బోర్డుకు కార్యాలయం బీజేపీ సంబరాలు
- మోడీ, అరవింద్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం

నిజామాబాద్, బతుకమ్మ : మూడు దశాబ్ధాలుగా పసుపు రైతుల కళ నెరవేరింది. పసుపు బోర్డు ఏర్పాటు హామీ.. పసుపు బోర్డు ఏర్పాటు.. పాలకవర్గం.. అధికారుల నియామకం.. ఇప్పుడు ఏకంగా కార్యాలయం ఏర్పాటు చేయడంతో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఇందూర్ పసుపు రైతుల కళను నెరవేర్చిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కృషి పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కమలనాథులు సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ శ్రద్దానంద్ గంజ్ లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం పసుపు హోళీ నిర్వహించారు.

పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, మహిళ నేత స్రవంతిరెడ్డిలు, ఇతర నాయకులు కలిసి పసుపు పూసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పసుపు రైతుల కళను నెరవేర్చిన ప్రధాని నరేంద్రమోడి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నిర్వహించారు. పసుపు రైతులు దిగుబడి వచ్చినా మద్దతు ధర లేదని పరిస్థితి ఉండదని పసుపు పరిశ్రమల ఏర్పాటుకు పసుపు బోర్డు ఏర్పాటుతో అంకురార్పణ జరిగినట్లేనని బీజేపీ నాయకులు అన్నారు.

