నిజామాబాద్, బతుకమ్మ : ధర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గణజ్యోతిరాణిపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న గణజ్యోతిరాణి చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఇప్పటికి పలుమార్లు ఫిర్యాదులు చేసిన విషయం తెల్సిందే. ఈ నెల 3న ఆర్జెడి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎంఈవో సేవ్ లా విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ తనిఖీలలో పాఠశాలలో పది క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. 300 మంది విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి గాను 45 కిలోలకు గాను 25 కిలోలు మాత్రమే ఇవ్వడంతో బియ్యం మిగిలినట్లు విచారణలో తేలింది.

దాంతో రెవెన్యూ శాఖ కూడా స్పందించి స్థానిక మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ తో తనిఖీలు నిర్వహించడంతో మిగులు బియ్యం దాచిన విషయం బహిర్గతమైంది. అంతేగాకుండా పాఠశాలకు చెందిన రికార్డు అసిస్టెంట్ నుంచి నెలకు రూ.3 వేలు వసూల్ చేసినట్లు ఎంఈవో విచారణలో బహర్గతమైంది. కొత్తగా ప్రమోషన్ వచ్చిన ఉపాధ్యాయులకు సాలరి బిల్లులు చేయడానికి అదనంగా వంద రూపాయలు చొప్పున తీసుకున్నట్లు రుజువు అయింది. పీఆర్సీ ఏరియార్స్ బిల్లు చేయడానికి ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున వసూల్ చేసిన వ్యవహరం కూడా వెలుగులోకి వచ్చింది. స్కావెంజర్లకు సంబంధించిన వేతనాలు పూర్తిగా ఇవ్వకుండా సగం సొమ్ము స్వాహా చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వచ్చిన నిధులలో 5 శాతం కూడా ఖర్చు చేయకపోవడంపై ఫిర్యాదులు రావడంతో వెలుగులోకి వచ్చింది. డీఏ బిల్లు చేయకపోవడం అడిగితే అవమానించినట్లు ఉపాధ్యాయులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. సంబంధిత హెడ్ మాష్టార్ వద్ద పని చేయలేమని పాఠశాలకు చెందిన స్కావెంజర్ మొదలుకుని ఉపాధ్యాయులందరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. హెడ్ మాష్టార్ స్టడీ హవర్ లో ఒక్క రోజు కూడా లేదని విచారణలో బట్టబయలైంది. గత సంవత్సర కాలంగా కాంప్లెక్స్ గ్రాంట్ లలో 50 శాతం గ్రాంట్ ఇవ్వకపోవడంపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై శాఖఫరమైన చర్యలు తీసుకుంటారా లేదా అని సంశయలు వ్యక్తమౌతున్నాయి. గతంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ తో పాటు రూరల్ ఎమ్మెల్యేకు, జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం తీసుకోలేదు.
