- రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలి
- పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పిలుపు
నిజామాబాద్, బతుకమ్మ : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పుకుంటూ ఎన్నికల హామీలను అమలు చేయకుండా కపటనీతిని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నిరసన కార్యక్రమాల ద్వారా నిలదీస్తామని, రైతులకు చేస్తున్న మోసాలను ఎండగడతామని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన రైతాంగానికి సంఘీభావంగా సోమవారం జరగనున్న నిరసన కార్యక్రమాలలో నిజామాబాద్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జీవన్ రెడ్డి పిలుపు నిచ్చారు.