- పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం
బతుకమ్మ, మాచారెడ్డి: రోడ్లపై చెత్త పేరుకపోవడమేమిటి..? జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు సజావుగా సాగుతలేవా? పారిశుధ్య నిర్వహణలోపంపై కామారెడ్డి జిల్లాకలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన కామారెడ్డి – సిరిసిల్ల ప్రధాన రహదారి పై గల మాచారెడ్డి, లక్ష్మీ రావులపల్లి తదితర గ్రామాల మెయిన్ రోడ్లు పై చెత్త పేరుకుపోయిన దృశ్యాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గమనించారు. వెంటనే ఆయన వాహనం నిలిపివేసి ఆ ప్రాంతాలను పరిశీలించారు. జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు సజావుగా జరుపాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాల్ని నిరంతరంగా ప్రతీ రోజూ నిర్వహించాలని, రోడ్లపై చెత్త కనబడకూడదని సూచించారు. అనంతరం ఆయన మాచారెడ్డి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో శిధిలావస్థలో ఉన్న రేకుల కార్యాలయాలను పరిశీలించారు. వాటి స్థానంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించడానికి పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ గోపి బాబు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఉన్నారు.
