- డబ్బులు లేక ఎరువులు కొనుగోలు చేయడం లేదా..?
- డీఏపీ లేక రైతన్నల తిప్పలు
- లారీ లోడ్ యూరియా రావాలంటె నెల ఆగాల్సిందే
- యూరియా కావాలంటె ఆధార్ తప్పనిసరి
- లబోదిబోమంటున్న రైతన్నలు
రుద్రూర్, బతుకమ్మ: రైతుల సంక్షేమం కోసం గ్రామీణా ప్రాంతాల్లో ప్రభుత్వం సొసైటీలను ఏర్పాటు చేస్తున్నప్పటికి తగిన రీతిలో రైతులకు న్యాయం జరగడం లేదు. సొసైటీల పాలకవర్గాల సభ్యుల నిర్లక్ష్య వ్యవహారశైలి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి నిదర్శనం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని సొసైటీల పనితీరు. యూరియా కావాలంటె రైతు ఆధార్ తప్పనిసరి చేసింది. అది కూడా ఆ రైతు పట్టాదారుడై ఉండి ఆధార్కార్డు తీసుకువస్తే గాని రెండు నుండి ఐదు యూరియా బస్తాలు అది కూడా వ్యక్తుల ను బట్టీ సరఫరా చేయడం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. నెల పైగా కావస్తున్న డీఏపీ ఎరువులు మాత్రం సరఫరా లేక పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి సరిపడా ఎరువులు సరఫరా చేయకపోతె ఈ సొసైటీలు మా కెందుకని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో రుద్రూర్ సొసైటీకి రెండు యూరియా లారీ లోడ్ లు ఒక లోడ్ డీఏపీ ఎరువులు మాత్రమే సరఫరా అయినట్లు విండో సెక్రటరీ లక్ష్మణ్ తెలిపారు. రుద్రూర్ సొసైటీలో అంబం, అక్బర్నగర్, రుద్రూర్, కొందాపూర్, లక్ష్మీపూర్క్యాంపు, తగిలెపల్లి గ్రామాలకు చెందిన రైతులు రుద్రూర్ సొసైటీలో 1700 మంది సభ్యులుగా ఉన్నారు. చైర్మన్, వైస్ఛైర్మన్తో పాటు 10 మంది డైరెక్టర్లు, 06 సిబ్బంది ఉన్నారు.
- ఎరువులు కావాలంటె నెల ఆగాల్సిందే..
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. విత్తనాలు వేయడం, నార్లు పోయడం, మరి కొన్ని ప్రాంతాల్లో ముందుగా నార్లు పోయడంతో నాట్లు వేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎరువుల కొరత ఉండడంతో రైతులు అధిక డబ్బలు చెల్లించి ప్రైవేటు ఎరువుల దుకాణాలను ఆశ్రయించి యూరియా,డీఏపీ,కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. గత నెలలో యూరియా 450 బస్తాలు, 400ల బస్తాల డీఏపీ మాత్రమే సొసైటీకి రావడం జరిగిందని, తగిలెపల్లి విలేజ్ కు 400 బస్తాల యూరియా సరఫరా చేసినట్లు సొసైటీ సెక్రటరీ లక్ష్మన్ తెలిపారు. మళ్ళీ జూన్ మూడవ వారంలో 450 బస్తాల యూరియా మాత్రమే సరఫరా చేశారు కానీ డీఏపీ మాత్రం సప్లై లేకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.
- డబ్బులు లేక ఎరువులు కొనుగోలు చేయడం లేదా..?
రుద్రూర్ సొసైటీలో ఎరువులు కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు లేకనే ఒక లోడ్ తెప్పించి ఆలోడ్ అయిపోకాగానే వచ్చిన డబ్బుతోనే మళ్లీ మరో లోడ్కు డీడీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందని కొందరు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కోసం సొసైటీకి వెళ్తే స్టాక్ లేదని పై నుండే తమకు ఎరువులు రావడం లేదని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రానికి పక్కనే ఉన్న రాయకూర్ సొసైటీకీ ఎరువులు ఎలా కొనుగోలు చేస్తారు రుద్రూర్ సొసైటీకీ ఎందుకు ఎరువుల కొరత ఉంటదని రైతులు మండిపడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితె గాని అసలు విషయాలు బయటికి వస్తాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళు కేంద్రాల ద్వారా వచ్చని కమీషన్ ఎంత, ఆ డబ్బులు దేనికి ఖర్చు చేశారో అసలు డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉన్నాయా, లేక పక్కదారి పట్టాయా అనే సందేహాలు కొందరు డైరెక్టర్లతో పాటు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.