రుద్రూర్, బతుకమ్మ : చేనేత వృత్తి పట్ల ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కల్పిస్తామని ఏడిఓ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని సిద్దిపేట ఏడిఓ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. సంఘంలో ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలను పరిశీలించారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘంలో ఉత్పత్తి అయిన బెడ్ షీట్లను టేక్సో ద్వారా కొనుగోలుకు ప్రతిపాదనలు చేశారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి వివరించారు. చేనేత వృత్తి పట్ల ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. శిక్షణ సమయంలో స్టైపండ్ కూడా అందజేస్తామని వివరించారు. ఆయనతో సంఘ అధ్యక్షుడు నారాయణ, కార్యాలయ సిబ్బంది నాగరాజు, నర్సింలు, కార్మికులు ఉన్నారు.
