- నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయం
- జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తా
- జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క
నిజామాబాద్, బతుకమ్మ : ఎన్నడూ జరగని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా ప్రచారంలో వెనకబడ్డామని జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయమని అన్నారు. రాష్ట్రంలో అందరి కంటే ముందే వరి నాట్లు నాటుతారని తెలిపారు. ఈ జిల్లాకు ఇంచార్జ్ మంత్రి కావటం తన అదృష్టమని అన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 4 న ఖర్గే హైదరాబాద్ రానున్నారని తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలు తప్పకుండా వెళ్ళాలని సూచించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. ఖర్గే మీటింగ్ కు అందరూ రావాలన్నారు. కార్యకర్తలు, నేతలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సన్నబియ్యంతో పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూంలు ఇస్తామని కెసీఆర్ మోసం చేసారని తెలిపారు. తాము సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గుడ్ లీడర్స్ గా ఉండాలి గాని, గ్రూప్ లీడర్స్ గా ఉండకూడదని కోరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ బనక చర్ల విషయంలో వాటర్ బోర్డు కమిషన్ తెలంగాణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఆ తీర్పు ను బి.అర్.ఎస్. విజయం అని చెబుతున్నారన్నారు. సీఎం రేవంత్ సర్కార్ కృషి వల్లే బనక చర్ల ప్రాజెక్టు పై తెలంగాణ కు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. రాజ్యాంగాన్ని ఆరెస్సెస్, బీజేపీ నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాయని పేర్కొన్నారు. బిజెపి కామన్ సివిల్ కోడ్ ను అమలు చేయాలని చూస్తోందన్నారు. దీనిపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఎమ్ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్రులే రైతులకు అండగా నిలుస్తూన్నాయన్నారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడు.. కాంగ్రెస్ వరి వేస్తే 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. దక్షిణ భారత దేశంపై బిజెపి వివక్ష చూపుతుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం పంపిణీ చేయటం లేదని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పని చేయాలని సూచించారు. గత బి.అర్.ఎస్. ప్రభుత్వం తప్పుడు సర్వేలతో.. వచ్చేది మా ప్రభుత్వం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేసిన పనులు చెప్పడం లో ఫెయిల్ అవుతున్నామని పేర్కొన్నారు.

