- డప్పు చప్పుల్లతో స్వామివారి చిన్న రథం పై ఎదుర్కొల్లు
- జనసంద్రంగా మారిన స్వామివారి కల్యాణం
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్తీకమాసంలో ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సోమవారం వేణుగోపాలుడి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. స్వామి వారి బాలాలయం నుండి ఉదయం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని చిన్న రథంపై డప్పు చప్పుళ్ల మధ్య ఎదుర్కోలు నిర్వహించారు. ఎడ్ల అంగడిబజార్ లో కళ్యాణ మండపాన్ని ఘనంగా ఏర్పాటు చేసి మండపానికి స్వామివారిని తీసుకువచ్చి వేద పండితులు, గ్రామ పురోహితులు వేదమంత్రాల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు అశ్విని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి.సత్యనారాయణ స్వామి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
