- రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
- పాలక్కాడ్ జిల్లాలో కూరగాయల తోటలను సందర్శించిన రైతు కమిషన్ బృందం
హైదరాబాద్, బతుకమ్మ : కేరళ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు కోసం అమలవుతున్న పాలసీ బాగుందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కౌలు రైతుల విషయంలో సైతం కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఆదర్శమన్నారు. కేరళలో అమలవుతున్న విధానాలను తెలంగాణలో అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి కృషి చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే రైతు కమిషన్ బృందం కేరళలో పర్యటిస్తుందన్నారు. శుక్రవారం పాలక్కాడ్ జిల్లాలోని వడవన్నూర్, ఎలెవంచెరి గ్రామాల్లో సాగవుతున్న కూరగాయల తోటలను కమిషన్ బృందం సందర్శించింది. ఆయా గ్రామాల్లో రైతులు, కౌలు రైతులతో కమిషన్ నేరుగా మాట్లాడి వివరాలను తెలుకుంది. అంతేకాదు కేరళలో అమలులో ఉన్న సహకార వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. వడవన్నూర్, ఎలెవంచెరి గ్రామాల పరిధిలో కొనసాగుతున్న వెజిటెబుల్ అండ్ ఫ్రూట్ ప్రమోషన్ కౌన్సిల్ కేరళ యూనిట్లను సందర్శించారు. ఇక్కడ మార్కెట్ ధర, రైతుల లావా దేవీలు ఎలా జరుగుతున్నాయని కమిషన్ బృందం అడిగి తెలుసుకుంది. అదేవిధంగా కమిషన్ బృందానికి కేరళ రాష్ట్రంలో సాగు విధానంపై వీఎఫ్ పీసీకే, కేరళ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేరళ ప్రభుత్వం తరుపు రైతులకు ఏం ఇస్తున్నారు ఎలా చేస్తున్నారు అనే విషయాలు చెప్పారు. రైతు ఉత్పాదకత, మార్కెటింగ్ సౌకర్యాలు, సమూహాల ఆధారిత వ్యవసాయ పద్ధతులపై వివరంగా కమిషన్ కు వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వ్యవసాయ అనుభవాల పరస్పర మార్పిడి, రైతులకు ఉపయోగపడే సాంకేతిక పద్ధతుల అధ్యయనం, మరియు రైతు సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్లు కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, ఉద్యనవన శాఖ అధికారి సురేష్, వ్యవసాయ శాఖ అధికారులు హరివెంటక ప్రసాద్, శ్రావణి వున్నారు.

