. . . చైర్మన్గా పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మన్గా మత్తమల భాగ్యవతి ఎన్నిక
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. చైర్మన్గా పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మన్గా మత్తమల భాగ్యవతి ఎన్నికయ్యారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తమ మద్దతు తెలుపుతూ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పాల్గొన్నారు. మూడు రోజులపాటు క్యాంపులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా సమావేశ మందిరంలోకి వెళ్లి కుర్చీలపై కూర్చొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీకి 60 శాతం ఓట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన కౌన్సిలర్లు అందరూ ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ ఆర్డీఓ పార్థసింహారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్ పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు. శాంతియుత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికలతో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. ప్రజాభిమానంతో ఎన్నికైన నాయకత్వం పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

