. . . ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ :
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని హనుమాన్ ఆలయం ధర్మశాల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని హనుమాన్ ఆలయ ధర్మశాల, వ్యాయామశాల నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక బాటలో నడవాలని సూచించారు. ఆలయాల అభివృద్ధి ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి కూడా అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. భక్తి మార్గంలో నడిచినప్పుడే మనిషి జన్మకు సార్థకత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ అధ్యక్షుడు నార్ల సురేష్ గుప్తాతో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, విద్యాసాగర్ షిండే, నార్ల ఉదయ్, శారద, దాసరి శ్రీనివాస్, పిట్ల శ్రీధర్, ఎజాజ్, కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
