- బోధన్ బంద్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
- షురూ అయిన రాజీనామాల పర్వం
- అందుబాటులో లేకుండాపోయిన సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : క్యాబినెట్ విస్తరణ మంటలు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ను తాకాయి. సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి రెండవ విడతలో మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. తొలి విడత, మలి విడత అని ఊరిస్తున్న మంత్రి పదవి రాకపోవడంతో నిరసనకు దిగారు. మంత్రి ప్రధాన అనుచరులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు అని చెబుతున్న ఆయన అనుభవాన్ని పార్టీకి విధేయతను విస్మరించారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. తమ నిరసనను కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేసేందుకు మంగళవారం బోధన్ బంద్ కు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అయితే బంద్ నిర్ణయం వెనక్కి తీసుకుని నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని కష్టాలలో ఆదుకుని జిల్లాలో పార్టీని సమన్వయం చేయడంతో పాటు కాంగ్రెస్ ఉనికిని కాపాడిన

సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు జిల్లాను సమన్వయం చేయడంలో సుదర్శన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించడంతో మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో అసంత`ప్తి జ్వలలు అంటుకున్నాయి. ఒక దిక్కు అనుచరుల రాజీనామాలు, నిరసనలు జరుగుతుండగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎవరికి అందుబాటులోకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఆయన అనుచరులు రాజీనామా చేస్తుంటే అడ్డుకోకపోవడం పార్టీ అధినాయకత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్న సుదర్శన్ రెడ్డి నోరు మెదకపోవడంపై పార్టీ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో కాంగ్రెస్ కు ముఖ్య నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి తన నియోజకవర్గంలో అసమ్మతి జ్వలాలను కంట్రోల్ చేయకపోవడం, నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు ముందే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అల్టీమేటం జారీ చేశారు. రాష్ట్రంలో మరో మూడు క్యాబినెట్ పదవులు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ముగ్గురు రెడ్లు పోటీ పడుతుండడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అసమ్మతి జ్వాలాలను ఎలా తగ్గిస్తారో వేచి చూడాల్సి ఉంది.
